శపధం నెరవేర్చుకుని అసెంబ్లీలోకి చంద్రబాబు
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శపధం నెరవేర్చారు. మళ్లీ సీఎంగానే గౌరవంగా అసెంబ్లీలోకి అడుగుపెడతానని గతంలో శపధం చేశారు చంద్రబాబు. అప్పటి వరకు ఈ సభలోకి అడుగుపెట్టనని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిన పూనారు. సరిగ్గా రెండున్నరేళ్ల తరువాత ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో గౌరవ సభలోకి అడుగుపెట్టారు చంద్రబాబు.
రెండున్నరేళ్ల క్రితం 2021 నవంబర్ 19న అసెంబ్లీలో ఈ శపథం చేశారు చంద్రబాబు. ఆరోజు అధికార వైసీపీ పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో అసెంబ్లీ నుంచి అవేదనతో బయటకు వెళ్లారు చంద్రబాబు. ఇది శాసన సభ కాదు, కౌరవ సభ అని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు..తిరిగి గౌరవ సభలోకి సగౌరవంగానే వస్తాను అంటూ ఆరోజు బయటకు వెళ్లిపోయారు. 2021 నవంబర్ 19 తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేేదు.
ఇదిగో ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు చంద్రబాబు. 4 సారి ఏపీ ముఖ్యమంత్రిగా సగర్వంగా సభకు వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో మొత్తం 164 మంది కూటమి సభ్యుల మధ్య అసెంబ్లీలోకి అడుగుపెట్టారు చంద్రబాబు. ఈ సందర్బంగా గతంలో చంద్రబాబు చేసిన శపధాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తు చేసుకుంటున్నారు.