గ్రూప్ -1 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చిన హైకోర్టు
తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..
స్పెషల్ రిపోర్ట్- టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ (Group 1 Prilims) పరీక్ష రద్దు కావడం ఇది రెండవసారి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను ఆదేశించింది. జూన్ 11 న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-1 పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ తీర్పును వెలువరించింది. గ్రూప్ -1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను ఆదేశించింది. ఐతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్కు వెళ్లనున్నట్లు సమాచారం.