ఐటీసీ మౌర్యాలో 14వ ఫ్లోర్ లో బసచేయనున్న బైడెన్
తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
న్యూ ఢిల్లీ రిపోర్ట్- అగ్రరాజ్యం అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తొలిసారి మన దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టారు. జీ20 (G20 Summit) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జో బైడెన్ దిల్లీ విచ్చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ (VK Singh) బైడెన్ కు స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. అమెరికా అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బైడెన్ తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్, ఇతర ఉన్నతాధికారులు విచ్చేశఆరు. ఎయిర్ పోర్ట్ నుంచి జో బైడెన్ నేరుగా ప్రధాని మోదీ (PM Modi) నివాసానికి వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు.
అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్, క్లిష్టమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, జేఈ జెట్ ఇంజిన్ ఒప్పందం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై జో బైడెన్, ప్రధాని మోదీ చర్చించినున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తెలిపారు. ఇరువురి నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం పూర్తయిన తర్వాత ఐటీసీ మౌర్యాలో (ITC Maurya) జో బైడెన్ బస చేయనున్నారు. ఐటీసీ మౌర్య హోటల్ ను ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ హోటల్ లోని 14 వ ఫ్లోర్ లోని ప్రత్యేక గదిలో జో బైడెన్ బసచేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 14వ ఫ్లోర్ కు వెళ్లడానికి హోటల్ లో ఉండే లిఫ్ట్ కాకుండా ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఐటీసీ మౌర్య హోటల్లో ఉన్న మొత్తం 400 గదులను జోబైడెన్ సహా అమెరికా అతిథుల కోసం బుక్ చేశారు.