జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే
తెలంగాణ 4వ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ నాలుగవ గవర్నర్ ప్రమాణం జిష్ణుదేవ్ వర్మ (jishnu dev varma) బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందజేశారు. ఆ తరువాత గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా మంత్రులు, అధికారులు గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న త్రిపురలోని రాజకుటుంబంలో జన్మించారు. 1990లో రామ జన్మభూమి ఉద్యమ టైంలో బీజేపీలో చేరారు. 2018 నుంచి 2023 వరకు త్రిపుర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు జిష్ణుదేవ్ వర్మ. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, విద్యుత్, ఆర్ధిక, ప్రణాళిక, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. జిష్ణుదేవ్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను పనిచేశారు.