హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు
హైదరాబాద్ లో 72వ మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) అట్టహాసంగా మొదలయ్యాయి. 120 కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో జయజయహే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆలాపనతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఆరంభ కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
మొత్తం 250 మంది కళాకారులతో నిర్వహించిన పేరిణి నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.