
భారత్- పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు తాను మధ్యవర్తిత్వం వహించానని అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్స్ వేధికగా ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో శనివారం సాయంత్రం పోస్ట్ పెట్టారు. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలతో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని చెప్పుకొచ్చిన ట్రంప్.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీరించాయని తెలిపారు. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయన్న ట్రంప్.. అందుకు ధన్యవాదాలు చెప్పారు. ట్రంప్ ఎక్స్ లో ఈ విషయాన్ని ప్రకటించిన కాసేపటి తరువాత ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ లు వేర్వేరు ప్రకటనల్లో ధ్రువీకరించాయి.
అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లో పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) సైతం ఇలాంటి ప్రకటనే చేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్, అసిమ్ మాలిక్ లతో చర్చించినట్లు తెలిపారు. తాను, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని మార్కో రుబియో స్పష్టం చేశారు.