
భారత్- పాకిస్థాన్ (Indo-Pak) మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో ఆయన సంతాపం వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలపాలని.. దేశమే ముందు అనేది అందరి నినాదం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశానికి కష్టమొస్తే సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమైన తరువాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమని చెప్పారు. దేశ రక్షణ కోసం జరిగిన వీరోచిత పోరాటంలో అగ్నివీర్ మురళీనాయక్ వీరమరణం పొందటం బాధాకరని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ.. ఎవరు మనపైకి వచ్చినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు ఉన్నా.. దేశ సమగ్రత విషయంలో అందరం ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషయమని, మత విద్వేషాలు లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.