
క్రికెట్ అభిమానులను బీసీసీఐ తీపి కబురు చెప్పబోతోంది. భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 8న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ను అర్ధంతరంగా నిలిపివేసింది బీసీసీఐ. ఆ తరువాత ఐపీఎల్ (IPL 2025) ను వారం రోజులు వాయిదా వేసింది. తాజాగా ఇరు దేశాల మద్య కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్ పున ప్రారంభానికి మార్గం సుగమమైంది.
భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ నేపధ్యంలో ఐపీఎల్ పునఃప్రారంభంపై క్రికెట్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. సరిహద్దులకు దూరంగా దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉందని కాల్పుల విరమణ ప్రకటనకు ముందే ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ లో ఇంకా మిగిలి ఉన్న 16 మ్యాచ్ ల నిర్వహణ విషయమై మే 11న బీసీసీఐ (BCCI) కీలక సమావేశం నిర్వహించనుంది. వీలైనంత త్వరగా ఐపీఎల్ మ్యాచ్ ల పునఃప్రారంభంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వనీయవర్గాల సమాచారం.