
స్పెషల్ డెస్క్- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) .. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అతి కీలకమైనది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అని అంచనా వేస్తున్నారు. ఇటువంట సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక ప్రకటన చేసింది. ఏఐ (AI) ని సమర్ధవంతంగా వినియోగించేందుకు, తద్వార ఉపాధి పొందేలా ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్స్లను ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపింది.
జనరేటివ్ ఏఐ లెర్నింగ్ కంటెంట్ పేరుతో ఉచితంగా నేర్పించే ఈ కోర్స్ ను ఔత్సాహికులు నేర్చుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ కోర్స్ నేర్చుకున్న వారు కెరియర్ ఎసెన్షియల్ సర్టిఫికెట్ సైతం పొందవచ్చు. తద్వారా ఏఐ ప్రొఫెషనల్ గా మారి ఉద్యోగాలు, బిజినెస్ కూడా చేసుకొని ఉపాధి పొందవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఏఐ సరికొత్త పని విధానాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెప్పారు. నైపుణ్యం పరంగా వృద్ది సాధించేలా తాము అభివృద్ది చేసిన ఏఐ కోర్స్ ఉపయోగపడుతుందని తెలిపారు.
గత రెండేళ్లలో టైర్ 2, టైర్ 3 పట్టాణాల నుండి దాదాపు 70 వేల మంది విద్యార్ధినులు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ పొందారని చెప్పారు. ఈ కోర్స్లను లింక్డిన్ తో కలిసి అభివృద్ది చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ యువత ఏఐ నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తే సత్తా విషయంలో రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల భారత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నివేదిక చెబుతోంది. ఇండియా ఏఐ స్కిల్స్, విస్తరించే విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం.