
సినిమా రిపోర్ట్- దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కలల ప్రాజెక్ట్ మహాభారతం (Mahabharata) సినిమాపై ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కీలక విషయాలు చెప్పారు. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందించాలని రాజమౌళి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఐతే అందుకు సంబందించిన విషయాలేవి రాజమౌళి ఇప్పటి వరకు చెప్పలేదు. తాజాగా మహాభారతం సినిమా గురించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని వివరాలను చెప్పడం ఆసక్తికరంగా మారింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ ఒక అడ్వెంచర్ కధతో రూపొందనుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. భారీ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతే కాదు ఆర్ఆర్ఆర్ (RRR) మూవీని మించి మహేష్ - రాజమౌళి సినిమా ఉండనుందని తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) లతో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ (RRR2) కు కధను రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఈ సారి భారీ హాలీవుడ్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను తెరకెక్కించాలే ప్లాన్ చేస్తున్నామన్నారు. ఐతే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తారా.. లేదంటే హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారా అనేది ఇప్పుడు చెప్పలేమన్నారు విజయేంద్ర ప్రసాద్. డైరెక్టర్ ఎవరైనా రాజమౌళి పర్యవేక్షణలోనే ఆ సినిమా రూపోందుతుందని స్పష్టం చేశారు. మహేశ్ బాబు సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమాను ప్రారంభించాలనుకుంటున్నామని కీలక విషయం చెప్పారు విజయేంద్ర ప్రసాద్. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సినీ ప్రియులంతా రాజమౌళి మహాభారతం గురించే మాట్లాడుకుంటున్నారు.