
హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్- టీఎస్పీఎస్సీ (TSPSC) గ్రూప్-2 (Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా రాయాల్సి ఉండడంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరుతూవస్తున్నారు. ఈమేరకు గ్రూప్ 2 అభ్యర్ధులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో సమావేశమయ్యారు. అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించి, పరిస్థితులను సీఎం కేసీఆర్ కు నివేదించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రూప్ 2 పరీక్షలను నవంబరుకు వాయిదా వేసినట్లు సీఎస్ శనివారం రాత్రి ప్రకటించారు.
తెలంగాణలోని లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్ను ముఖ్యమంత్రి కేసీఆర్ (KTR) ఆదేశించారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో నియామక పరీక్షల నోటిఫికేషన్ లు సరిగ్గా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, దీని ద్వారా ప్రతి అభ్యర్థికి అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుందని ఆయన చెప్పారు. మొత్తానికి గ్రూప్ 2 పరీక్షలు వాయిదాపడటంతో సుమారు 5.5లక్షల మంది అభ్యర్ధులు ఊపిరిపీల్చుకున్నారు. TSPSC Group-2 Exams