Newspillar
Newspillar
Tuesday, 26 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు వ్యవహారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఏపీకి సంబంధించిన అంశమని కేటీఆర్ అన్నారు. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధమన్న కేటీఆర్.. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తగత వ్యవహారమని కామెంట్ చేశారు. చంద్రబాబు అరెస్టు అయింది ఆంధ్రప్రదేశ్‌ లోనన్న కేటీఆర్.. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలని చెప్పారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో తాము తటస్థంగా ఉన్నామని, ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ విషయం కోర్టు పరిధిలో ఉందన్న కేటీఆర్, ఈ టైంలో రోడ్లపైకి వచ్చి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడకూడదని సూచించారు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారని, ఆయనకు జరగాల్సిన న్యాయం కోర్టులో జరుగుతుందని కామెంట్ చేశారు. ఇక నారా లోకేశ్‌ .. సీఎం జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ తనకు మంచి స్నేహితులని అన్నారు కేటీఆర్. ఆంధ్రాలో తనకు తగాదాలు లేవని, ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌ లో అందరూ కలిసి మెలసి ఉంటున్నారని.. హైదరాబాద్ లో ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఓ మిత్రుడి ద్వారా లోకేశ్‌ ఫోన్‌ చేయించారని.. ఒకరికి అనుమతిస్తే.. ఇంకొకరు ర్యాలీ చేస్తారని కేటీఆర్ చెప్పారు.