
హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ (DGP Jitender) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జీఓ విడుదల చేసింది రేవంత్ సర్కార్. కొత్త డీజీపీగా నియమితులైన జితేందర్ సెక్రెటరియేట్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కొత్త డీజీపీ జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ లో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి కాగా ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తరువాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పనిచేశారు. గతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు జితేందర్. ఐ తరువాత దిల్లీ సీబీఐలో, 2004-06 మధ్య గ్రేహౌండ్స్లో పనిచేశారు.
డీఐజీగా పదోన్నతి పొందిన జితేందర్ విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో బాధ్యతలు నిర్వర్తించిన తరువాత హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా విధులు నిర్వర్తించారు.
ఆ తరువాత జితేందర్ తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న జితేందర్ ను తెలంగాణ డీజీపీగా నియమించింది ప్రభుత్వం. జితేందర్ (Telangana DGP Jitender) 2025 సెప్టెంబరులో రిటైర్డ్ కాబోతున్నారు. అప్పటి వరకు తెలంగాణ డీజీపీగా కొనసాగనున్నారు ఐపీఎస్ అధికారి జితేందర్.