ISRO

సిద్దమైన చంద్రయాన్‌-3

సిద్దమైన చంద్రయాన్‌-3.. ప్రయోగానికి ముహూర్తం ఖరారు

శ్రీహరికోట- భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడుతోంది. చంద్రయాన్‌-3 కు ముహూర్తం ఖరారైంది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) జులై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు జాబిల్లి  వైపు దూసుకెళ్లనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ మిషన్‌ కు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. యువ శాస్త్రవేత్త వీరముత్తుయేల్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఉపగ్రహం అనుసంధాన పనులతోపాటు రోవర్‌, ల్యాండర్‌ బిగింపు పనులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. 

శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎం-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 615 కోట్ల రూపాయలు కేటాయించింది. 2008లో ఇక చంద్రయాన్‌-1 ప్రయోగం చేపట్టగా అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ, సుమారు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. 

చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత ఆ మిషన్‌ ముగిసినట్లు ఇస్రో 2009లో ప్రకటించింది. ఆ తరువాత చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌ 3 మిషన్‌ సక్సెస్ ఐతే భారత్ అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి పడినట్టేనని చెప్పవచ్చు.


Comment As:

Comment (0)