పదేళ్ల నిజం బీఆర్ఎస్- వంద రోజుల అబద్దం కాంగ్రెస్- కేటీఆర్
మల్కాజ్ గిరి నుంచి ఇద్దరం పోటీ చేద్దాం- రేవంత్ కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రిపోర్ట్- బీఆర్ఎస్ పదేళ్ల నిజమైతే.. కాంగ్రెస్ వంద రోజుల అబద్ధమని అన్నారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ()KTR). తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదని ఈ సందర్బంగా ఆయన విమర్శించారు. రైతుల్లో బాధ మొదలైందని, యువత ఆవేదనతో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో తెలియక హైదరాబాద్ ప్రజలు ఆలోచనలో పడ్డారని సెటైర్ వేశారు.
రాష్ట్రంలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదన్న కేటీఆర్.. డిసెంబర్ 9న విడుదల చేస్తామని చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆటోడ్రైవర్లు కోపంగా ఉన్నారని.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే బాధగా ఉందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే.. అరిచేవారికి సమాధానం కావాలని కామెంట్ చేశారు. ఇద్దరం మల్కాజ్ గిరి నుంచి పోటీ చేద్దామని.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పెద్దపెద్ద డైలాగ్ లే తప్పా.. రేవంత్ రెడ్డికి ధైర్యం లేదన్న కేటీఆర్.. బీజేపీలోకి పోవాలన్నది ఆయన ఆలోచన అని చెప్పారు.