ఆసియాకప్-2023ను సొంతం చేసుకున్న భారత్.
ఆసియా కప్ 2023 గెలిచిన టీమ్ ఇండియా
స్పోర్ట్స్ రిపోర్ట్- టీం ఇండియా ఆసియా కప్ 2023 (Asia Cup 2023) విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన ప్రదర్శించింది. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ 2023ను టీం ఇండియా సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఎనిమిదోసారి ఆసియాకప్ ను దక్కించుకుంది టీం ఇండియా. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) (Mahammad Siraj)చలరేగిపోయాడు. శ్రీలంక బ్యాటింగ్ వెన్ను విరగొట్టిన వేళ 50 పరుగులకే లంక బ్యాటర్లంతా కుప్పకూలిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు శుభ్మన్ గిల్ (27-19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (23- 18 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ కోల్పోకుండా భారత్ ను విజయం వైపు నడిపించారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, భారత బౌలర్ల దెబ్బకు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీం ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోకుండా దెబ్బతీశాడు. ఆసియా కప్లో మహమ్మద్ సిరాజ్ బెస్ట్ బౌలింగ్ కావడం విశేషం. శ్రీలంక ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ గా పెవిలియన్కు చేరారు. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, పతిరన పరుగులేమీ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ చేరారు. మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆఖర్లో దుషాన్ హేమంత (13) కాస్త పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు కొంతైనా పెరిగింది. టీం ఇండియా ముందు 51 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉండటంతో సునాయాసంగా గెలిచారు. ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు, హార్దిక్ పాండ్య మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.