Jagan Chandrababu

జగన్ కు చంద్రబాబు లేఖ

సీఎం జగన్‌ కు చంద్రబాబు లేఖ.. అక్రమాలను అడ్డుకోండి

అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. నిరసనలు తెలుపుతున్న దళితులపై దాడి చేసి గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో వారికి కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ తమ అనుచరుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ తవ్వకాలను నిరసిస్తూ ఈనెల 6న చించినాడ దళితులు నిరసనలకు దిగితే పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. గాయాలైన వారిని పోలీసులు సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో నిందితులను రక్షించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించిన చంద్రబాబు, పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.


Comment As:

Comment (0)