పాక్ లో ప్రియుడిని పెళ్లి చేసుకున్న మహిళకు పిల్లలపై బెంగ
అంజూ అలియాస్ ఫాతిమా భారత్ రానుందట..
ఇంటర్నేషనల్ రిపోర్ట్- ఇండియా, పాకిస్థాన్ ప్రేమలో మరో ట్విట్ట్. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన అంజూ (Anju) అనే పెళ్లై, పిల్లలున్న మహిళ.. ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లి ప్రియుడిని పెళ్లాడింది అంజూ. ఇండియా మహిళ, పాకిస్థాన్ యువకుడి ప్రేమ పెళ్లి వ్యవహారం పెద్ద సంచలనం అయ్యింది. ఇంతవరకు బాగానే ఉన్నా అంజూ వచ్చే నెలలో ఇండియాకు వస్తోందట. అంజూ తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు పాకిస్థాన్ లో ఆమెను పెళ్లాడిన నస్రుల్లా (Nasrullah) ఓ వార్తాసంస్థ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. ఈ క్రమంలో వచ్చే నెలలో అంజూ భారత్కు వెళ్లాలనే యేచనలో ఉన్నట్లు తెలిపాడు.
అన్నట్లు అంజూ పాకిస్థాన్ వెళ్లి నస్రుల్లాను పెళ్లాడిన తరువాత తన పేరును ఫాతిమా (Fatima) గా మార్చుకుంది. ఇటీవలి పరిణామాలతో ఫాతిమా మానసిక వేదనకు గురవుతోందని, అంతే కాకుండా తన పిల్లలను కోల్పోతున్నానన్న భావన ఆమెకు కలుగుతోందని చెప్పాడు నస్రుల్లా. ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదని, ఆమె తన పిల్లలను చూడటానికి భారత్ వెళ్లడం మంచిదని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఐతే ఇండియాకు వెళ్లడానికి పాకిస్థాన్లో డాక్యుమెంటేషన్ ప్రక్రియకు కొంత టైం పడుతుందని, వచ్చే నెలలో ఆమె భారత్కు వెళ్లే అవకాశం ఉందని నస్రుల్లా చెప్పాడు. తనకు కూడా వీసా మంజూరైతే తానూ సైతం ఫాతిమాతో ఇండియా వెళ్తానన్నాడు.
ఇక అంజూ ఇలియాస్ ఫాతిమాకు ఇదివరకే పెళ్లవగా, ఆమెకు 15 సంవత్సరాల కూతురు, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. పాకిస్థాన్ లో వివాహం తర్వాత అంజూ పేరు ఫాతిమాగా మారింది. ఆ జంటకు అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, కొంత డబ్బు బహుమతిగా ఇచ్చాడు. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఫాతిమా, నస్రుల్లా ఉంటున్నారు. మరి అంజూ భారత్ వస్తే ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.