భారీ భూకంపాలతో అతలాకుతలం అయిన జపాన్
వరుసగా 21 భూకంపాలు - చిగురుటాకులా వణికిన జపాన్
ఇంటర్నేషనల్ రిపోర్ట్- జపాన్ మరోసారి భూకంపాలతో (Japan earthquake) వణికిపోయింది. కొత్త సంవత్సరం రోజే వరుస భూకంపాలతో జపాన్ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత కంటే ఎక్కువ స్థాయిలో ఏకంగా 21 భూకంపాలు నమోదయ్యాయి. దీంతో జపాన్ లోని ఇషికావా ద్వీపకల్పంలోని వాజిమా పోర్టులో సరిగ్గా 4.21 గంటల టైంలో సుమారు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు. దీని ప్రభావంతో వాజిమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. భూకంపదాటికి కొన్నిచోట్ల రోడ్లపై భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో సునామీ అలలు అధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. సుమారు 36 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
ప్రధానంగా జపాన్ లోని హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. భూకంప కేంద్రానికి దగ్గర్లోని ప్రధాన రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్తు కేంద్రం మాత్రం ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. జపాన్లో ప్రతి సంవత్సరం సుమారు 5 వేల చిన్నాపెద్దా భూకంపాలు వస్తుంటాయి. అందుకు అనుగునంగా అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సన్నద్దులై ఉంటారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది. దీంతో 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో 450 అగ్నిపర్వతాలున్నాయి. జపాన్ మొత్తం నాలుగు కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ప్లేట్లు తరచూ కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో జపాన్ లోని భూమి కదిలి భూప్రకంపనలు తద్వార భూకంపాలు వస్తుంటాయి.