బిపోర్జాయ్ తుఫాను
మూడు రాష్ట్రాలకు హెచ్చరికలు - వచ్చే 24 గంటల్లో మరింత తీవ్రంగా బిపోర్జాయ్ తుఫాను
ముంబయి డెస్క్- భారత వాతావరణ శాఖ 3 రాష్ట్రాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను మరో 24 గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం బిపోర్జాయ్ (Biparjoy) తుఫాను గోవాకు పశ్చిమాన 690 కిలో మీటర్ల దూరంలో, ముంబయికి పశ్చిమ-నైరుతి దిశలో 640 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
బిపోర్జాయ్ తుఫాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాకుండా బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. బిపోర్జాయ్ తుఫాను నేపధ్యంలో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ అలల కారణంగా గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్ బీచ్ను ఈ నెల 14 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు.