మళ్లీ ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్ష జరిగే అవకాశం
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా
స్పెషల్ రిపోర్ట్- అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్షలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. మొన్న గ్రూప్-2 పరీక్ష వాయిదా పడగా, తాజగా ఉపాధ్యాయ నియామక పరీక్ష- డీఎస్సీ (Telangana DSC) వాయిదా పడింది. నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్- టీఆర్టీ (TRT) పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది విద్యా శాఖ. ఐతే నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆమె చెప్పారు. అన్నీ కుదిరితే వచ్చే యేడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు జరగవచ్చని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.