ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ వాసుల మృతి
ఇంటర్నేషనల్ రిపోర్ట్- అగ్రరాజ్యం అమెరికాలో (America) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ (Texas) హైవేలో జరిగిన యాక్సిడెంట్ లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. టెక్సాస్ లోని జాన్సన్ కౌంటీలో ఉన్న హైవే నంబర్ 67పై ఓ ట్రక్కు మినీవ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం వాసులు ఉన్నారు.
ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అమెరికాలో జరిగిన ఈ ప్రమాదంపై స్పందించిన తానా సభ్యులు బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు. తానా (TANA) అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ సూచన మేరకు తానా ట్రెజరర్ అశోక్ కొల్లా, ఫౌండేషన్ ట్రెజరర్ పోలవరపు శ్రీకాంత్ ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించారు. మృతి చెందిన వారి మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి తగిన సాయం చేస్తామని తానా తెలిపింది.