Manipur Video

మణిపుర్‌లో (Manipur Video) మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 

మహిళలను నగ్నంగా చేసి.. కొట్టుకుంటూ.. అసలు ఆ రోజు ఏం జరిగింది..?

నేషనల్ డెస్క్- మణిపుర్‌ (Manipur Violence) 70 రోజులుగా వివిధ జాతుల మధ్య వివాదాలు, ఘర్షణలతో అట్టుడికిపోతోంది. మే 3న మణిపుర్‌లో రెండు తెగల మధ్య ముందుగా హింస మొదలైంది. రెండు వర్గాల దాడులతో మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా అతలాకుతలం అయ్యింది. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారని పోలీసులు చెప్పారు.

ఇందులో భాగంగా తమ ఊరి మీదికి కూడా ఆ వర్గం దాడి చేయనుందనే సమాచారం రావడంతో, మే 4వ తేదీన బీ.ఫయనోమ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు రేడీ అవ్వగా ఈ క్రమంలో వారికి నాంగ్‌ పోక్‌ సెక్‌ మై వద్ద పోలీసులు కనిపించడంతో రక్షణకోసం వారి వద్దకు వెళ్లారు. ఇందులో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) ఒకే కుటుంబం కాగా.. మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అంతలోనే సుమారు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ పెద్ద గుంపు బీ.ఫయనోమ్‌ గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురి బృందాన్ని అడ్డగించింది.

పోలీసుల వద్ద నిలబడి ఉన్న వారిపై దాడికి పాల్పడింది. అందులోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించగా, సాయుధ మూకల దాడిలో అతడితో పాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులతో పాటు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. ఆ తరువాత ఆ సాయుధ గుంపులోకి కొందరు 21 ఏళ్ల యువతితో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. కొందరు యువకులు అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తడుముతూ అసభ్యంగా ప్రవర్తించారు. అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది.

బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. గుర్తుతెలియని సాయుధ దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన నాంగ్‌ పాక్‌ సెక్‌మై పోలీసు స్టేషన్‌కు మే 21న ఈ కేసును బదిలీ చేశారు. మే 4న చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో, జులై 19న సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో దేశమంతా షాక్ కు గురైంది. మణిపుర్‌లో మే 3నుంచి ఇంటర్నెట్‌ వినియోగంపై నిషేధం ఉన్న నేపధ్యంలో ఇన్ని రోజులు తరువాత ఈ వీడియోలు బయటకు వచ్చింది.

తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం, వెంటనే వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్‌ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, పార్లమెంటు ఉభయ సభలతో పాటు సుప్రీం కోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 

 

 

 

 


Comment As:

Comment (0)