రాజమౌళి- మహేశ్ బాబు మాట నిలబెట్టుకున్నారు- SSMB29 నిర్మాత నారాయణ
సినిమా రిపోర్ట్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నారని అగ్ర నిర్మాత కె.ఎల్. నారాయణ (KL Narayana) చెప్పారు. ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబందించి #SSMB29 వర్కింగ్ టైటిల్ ని వాళ్లే స్వయంగా ప్రకటించి, పనిపై ఉన్న నిబద్ధతను చాటుకున్నారని ఆయన అన్నారు. హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు కేఎల్ నారాయణ. ఐతే చాలా కాలం తరువాత రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబీ 29ని నిర్మిస్తున్నారాయన.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఎల్ నారాయణ ఈ క్రేజీ మూవీకి సంబందించి ఏమన్నారంటే.. ఉద్దేశపూర్వకంగా నేను నిర్మాతగా విరామం తీసుకోలేదు.. రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ సినిమాను పదిహేనేళ్ల క్రితమే ఫిక్స్ చేశాం.. ఐతే ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్ మరో స్థాయిలో ఉంది.. ఐనప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు.. నేను చెప్పకపోయినా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తీయనున్నట్లు వాళ్లే ప్రకటించారు.. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని.. రాజమౌళికి హాలీవుడ్ నుంచీ ఆఫర్లు వచ్చాయి.. వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు.. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఇక పాత్రకు తగ్గట్టు మహేశ్ బాబు తనని తాను మలుచుకుంటున్నారు.. ఆగస్టు లేదా సెప్టెంబరులో మూవీ చిత్రీకరణ మొదలవుతుంది. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు. కధ చాలా బాగుంది. బడ్జెట్ని ఇంకా డిసైడ్ చేయలేదు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారు. పేపర్ వర్క్ చేస్తున్నప్పుడే క్లారిటీ ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఏమైనా సందేహం ఉంటే చెప్పమని అడుగుతారు.. చిన్న పాయింట్నీ ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో దగ్గర ఉండి చూస్తున్నానని చెప్పుకొచ్చారు నిర్మాత కేఎల్ నారాయణ.