మరికొన్ని గంటల్లో చంద్రయాన్‌-3 ల్యాండింగ్- దక్షిణాఫ్రికా నుంచి వీక్షించనున్న ప్రధాని మోదీ

చంద్రయాన్‌ దిగే ఘట్టాన్ని చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తి

మరికొన్ని గంటల్లో చంద్రయాన్‌-3 ల్యాండింగ్- దక్షిణాఫ్రికా నుంచి వీక్షించనున్న ప్రధాని మోదీ

నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చందమామపై పరిశోధనల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌- 3 (Chandrayaan 3) మరికొన్ని గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టబోతోంది. ఇంతవరకు ఎవరు అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై (Lunar South pole) చంద్రయాన్‌-3 దిగే అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు మొత్తం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ అద్వితీయమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. 

ఐతే బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో (Brics Summit 2023) పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా (South Africa) వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్ ను వీక్షించనున్నారని అధికారికవర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధృవంపై (Lunar Surface) ల్యాండ్ అవుతుంది. దీన్ని చంద్రుడిపై సురక్షితంగా దించేందుకు ఇస్రో అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.