టీడీపీ అధికారంలోకి రాగానే 4 వేల పింఛన్
ముఖ్యమంత్రి జగన్ పింఛన్ దారుల పొట్టకొట్టారు-చంద్రబాబు
అమరావతి రిపోర్ట్- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో పింఛనర్ల పొట్టకొట్టారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)విమర్శించారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే 4 వేల పింఛన్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు జరిగే ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్ అందకపోతే, ఎన్నికల తరువాత తమ ప్రభుత్వం కొలువుదూరగానే అది కూడా కలిపి ఇస్తామని భరోసా ఇచ్చారు. జగన్ అధికారం నుంచి దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
టీడీపీ నేతలు నిరుపేదలకు ఫించన్లు ఇప్పించే వరకు రాజీ పడొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందేలా చూడాలని చెప్పారు. ప్రజాక్షేత్రంలో జగన్ ను దోషిగా నిలబెట్టాలన్న చంద్రబాబు.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జగన్ 13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ఈ 15 రోజుల్లో ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని ి చంద్రబాబు డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు.. తటస్థంగా పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.