బీజేపీని ప్రశ్నించినందుకే నాకు నోటీసులు- సీఎం రేవంత్ రెడ్డి
కర్ణాటక రిపోర్ట్- ఢిల్లీ పోలీసుల నోటీసులపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (CM Revanth) స్పందించారు. బిజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన తనకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని మండిపడ్డారు. అసలేంజరిగిందంటే…
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ల మధ్య వైరం తారా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్కు వచ్చిన ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీశ్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్లకు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి సైతం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబందించిన విచారణకు మే 1న మొబైల్ ఫోన్ తీసుకొని హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్-ఎక్స్ లో పోస్టు చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొనగా.. అక్కడ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. ఐతే దీన్ని కొంత మంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా వీడియోనవు ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీచేశారు.