విజయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పొంగల్ బరిలో దళపతి సినిమా
తమిళ హీరో విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సెన్సార్ సమస్యల కారణంగా జన నాయగన్ వాయిదా పడటంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ అభిమాన హీరో నటించిన చివరి చిత్రం కావడం, అందులోనూ పొంగల్ కు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంతలో కోర్టు ఉత్తర్వులతో ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. అయితే పండగకు తాను సిద్ధమేనని అంటున్నారు విజయ్. ఆయన కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ తేరి 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు లోనూ పోలీసోడు పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రేడీ అయ్యింది. జనవరి 15న తమిళనాడులో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించారు. తేరి విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండగకు వెండితెరపై తమ అభిమాన హీరోను చూసే ఛాన్స్ తేరి తో కలగనుందని సంతోషపడుతున్నారు.