సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ 1 (Aditya-L1 ప్రయోగం
మరికొన్ని గంటల్లో నింగిలోకి ఆదిత్య ఎల్-1
స్పెషల్ రిపోర్ట్- చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ తో మంచి ఉత్సాహంగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్దమైంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో (ISRO) చేపడుతున్న ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) నింగిలోకి దూసుకెళ్లేందుకు రేడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. అప్పటి నుంచి 23 గంటలకు పైగా ఈ కౌంట్ డౌన్ తరువాత శనివారం సెప్టెంబరు 2న సరిగ్గా ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం నేపథ్యంలో ఉపగ్రహ ఆకృతిని తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మరోవైపు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somanath) సూళ్లూరుపేటలోని చెంగలమ్మ పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకుని ప్రయోగం సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు చేశారు. సూర్యుడి గురించి పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపడుతున్న మొదటి మిషన్ ఆదిత్య-ఎల్ 1. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలు చేస్తోంది ఇస్రో.
ఆదిత్య-ఎల్ 1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి (Earth) నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడి నుంచైతే గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక
ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (VELC) తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్ లను పంపుతున్నారు.
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్ లను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయని ఇస్రో తెలిపింది. ఇక ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) ప్రయోగాన్ని నేరుగా చూసేందుకు ఆసక్తి ఉన్న పౌరులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు శనివారం షార్ నుంచి ప్రయోగాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించవచ్చు. (Aditya-L1)