undefined

12.75 లక్షల వరకు పన్ను లేదు..

కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ సందర్బంగా దేశంలో వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Finance Minister Nirmala sitharaman) శుభవార్త చెప్పారు. నూతన పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలుపుకొంటే 12.75 లక్షల రూపాయల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా కొత్త పన్ను విధానంలో శ్లాబులు కూడా సవరించారు. కానీ 12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతూనే.. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెప్పడంతో చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. 

నూతన ట్యాక్స్ విధానం (New Income Tax Regime)లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి 12.75 లక్షలు అనుకుంటే అందులో స్టాండర్డ్‌ డిడక్షన్‌ ను 75 వేలు తొలగిస్తారు. అప్పుడు 12 లక్షల రూపాయలను పన్ను ఆదాయంగా పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు వర్తించే ట్యాక్స్ ను ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ను మినహాయిస్తారు. తాజా బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను 60 వేలుగా నిర్ణయించారు. కాబట్టి వేతన జీవులకు 12.75 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. కానీ స్థూల ఆదాయం 12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించని ఆదాయం 7.75 లక్షలుగా ఉండగా.. సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ 25వేల రూపాయలుగా ఉంది.

ఇక ఆదాయపు పన్ను లెక్కింపు విషయానికి వస్తే.. ఉదాహారణకు ఓ వ్యక్తి ఆదాయం 12.75 లక్షల రూపాయలు అనుకుంటే..75 వేలు ప్రామాణిక తగ్గింపును మినహాయిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 12 లక్షలు అవుతుంది. దీనిపై శ్లాబుల (Income Tax Slab) ప్రకారం పన్ను వర్తింపజేస్తే సుమారు 60 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగంటే.. 0-4 లక్షలు - సున్నా పన్ను, 4 నుంచి 8 లక్షల వరకు 5 శాతం  అంటే 20 వేలు ట్సాక్స్, 8 నుంచి 12 లక్షల వరకు 10 శాతం  పన్ను అంటే 40 వేలు.. అంటే వాస్తవానికి మొత్తం  పన్ను 60 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ మినహాయిస్తే చెల్లించాల్సి పన్ను సున్నా అవుతుంది.

నూతన పన్ను విధానంలో తాజా మార్పుల వల్ల 12 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నవారికి 80వేల మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ (Union Budget) ప్రసంగంలో స్పష్టం చేశారు. 18 లక్షలు ఆదాయం పొందుతున్న వారికైతే 70 వేలు చేకూరుతుందన్నారు. అదే 25 లక్షలు ఆదాయం ఉన్న వారికి సవరించిన శ్లాబుల ప్రకారం సుమారు 1.10 లక్షలు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 


Comment As:

Comment (0)