ఫారెన్ టూరిస్టులకు ఉత్తర కొరియా అనుమతి..
విదేశీ పర్యాటకులకు శుభవార్త చెప్పిన కిమ్ జోంగ్
ఉత్తర కొరియా (north korea) అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ (kim jong un) విదేశీ టూరిస్టులకు తీపి కబురు చెప్పాడు. ఉత్తర కొరియా దేశాన్ని సందర్శించాలనుకునే టూరిస్టులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. డిసెంబర్ నుంచి ఉత్తర కొరియాలోని ఈశాన్య నగరం సంజియోన్ కి అంతర్జాతీయ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించాలని కిమ్ జోంగ్ నిర్ణయించాడు. ఈ క్రమంలో దేశంలోని మిగతా ప్రాంతాలకు సైతం ఇదే సమయంలో పర్యాటకాన్ని అతనుమతించే అవకాశం ఉందని ఉత్తర కొరియా టూరిస్ట్ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
కఠినమైన కరోనా నిబంధనల కారణంగా ఉత్తర కొరియా గత నాలుగేళ్లుగా తన సరిహద్దుల్ని పూర్తిగా మూసేసింది. 2020 నుంచి ఉత్తర కొరియా అంతర్జాతీయ టూరిస్టులను నిషేధించింది. తాజాగా కోవిడ్ తగ్గడంతో తమ దేశానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశం కోసం సుమారు నాలుగేళ్లుగా వేచి ఉన్నట్లు కొరియో టూర్స్ సంతోషం వ్యక్తి చేసింది. ఉత్తర కొరియా గత యేడాది 2023లో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. రష్యన్ పర్యాటకులు ఫిబ్రవరిలో ప్రైవేట్ పర్యటన కోసం ఉత్తర కొరియా వెళ్లారు.
జూన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సహా విదేశీ ఉన్నతాధికారులు ఆ దేశాన్ని సందర్శించారు. ఉత్తర కొరియా లోని సంజియోన్ నగరం చైనా సరిహద్దులకు దగ్గర ఉంది. ఈ ప్రాంతంలో కొత్త అపార్ట్మెంట్లు, స్కీ రిసార్టులు, హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మరోవైపు తన కలల ప్రాజెక్టుగా ఉన్న సంజియోన్ నగర అబివృద్దిపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆరోపణలపై కిమ్ జోంగ్ ఉన్ కొంత మంది సీనియర్ అధికారుల్ని విధుల నుంచి తప్పించారు.