డిప్యూటీ సీఎంగా తొలిసారి పిఠాపురానికి పవన్
కాకినాడలో మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ పర్యటన
కాకినాడ రిపోర్ట్- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జులై 1 సోమవారం నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పవన్ కు సంబందించిన మూడు రోజుల పర్యటన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. సోమవారం మొదటి రోజు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గ సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్.
ఇక మంగళవారం జులై 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు డిప్యూటీ సీఎం పవన్. ఆ రోజు సాయంత్రం జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. బుధవారం జులై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో పాల్గొని మాట్లాడతారు పవన్. డిప్యూటీ సీఎం మూడు రోజులు పర్యటనను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ పర్యటన ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సమీక్షించారు.