యానాంలో రికార్డు ధరకు అమ్ముడైన పులస
పులస చేప ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పెషల్ రిపోర్ట్- పులస చేప (Pulasa Fish) గురించి తెలుసా మీకు? వర్షా కాలంలో సముద్రంలోంచి గోదావరి నడిలోకి ఎదురీదుతూ వస్తుంది పులస. దీంతో ఈ చేపకు ఎక్కడలేని రుచి వస్తుందని చెబుతారు. అది కూడా యానాం (Yanam), కాకినాడ (Kakinad), రాజమండ్రి (Rajamundry) గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఈ పులస అరుదుగా దొరుకుతుంది. ఇక ఎప్పుడో గాని దొరకని పులస చేపకు చాలా డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కు తగ్గ రేటు కూడా ఉంటుందనుకొండి. ఇదిగో ఇటువంటి సమయంలో యానాంలో ఓ మత్స్యకారుడి వలలో పులస చేప చిక్కింది. మంగళవారం సాయంత్రం పుష్కరఘాట్ వద్దకు మత్స్యకారుడు వనమాడి ఆదినారాయణ తన వలకు చిక్కిన రెండు కిలోలకు పైగా బరువున్న పులస చేపను తెచ్చాడు.
దానిని స్థానికంగా ఉండే కొల్లు నాగలక్ష్మి (Kollu Nagalakshmi) వేలంలో 19 వేల రూపాయలకు కొనుక్కుంది. రావులపాలెంకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కోసం మరో వ్యక్తి ఆమె నుంచి 26 వేల రూపాయలకు పులస చేపను కొన్నుకున్నారు. ఈ సీజన్ లో పులస పెద్దగా రావడం లేదని, అందుకే అంత ధర పలికిందని స్థానికులు చెప్పారు. ఇక పులస చేప కూర వండుతుంటే కనీసం కిలోమీటరు వరకు వాసన వస్తుందని చెబుతారు. అందుకే పుస్తేలు అమ్మెసి అయినా పులస తినాలన్నది రాజమండ్రి ప్రాంతంలో నానుడి. అవకాశం ఉంటే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.