నాలుగు లారీల్లో 2వేల కోట్ల రూపాయలు..
ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్- లోక్ సభ ఎన్నికల వేళ భారీస్థాయిలో నగదు పట్టుబడటం ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు భారీ కంటైనర్లలో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తోన్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు. ఒక్కో కంటైనర్ లో 500 కోట్ల రూపాయలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అంటే మొత్తం నాలుగు కంటైనర్లలో 2వేల కోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించిన తరువాత కొచ్చి రిజర్వ్ బ్యాంకు నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి డబ్బుతో కూడన కంటైనర్లు వెళ్తున్నాయని పోలీసులు నిర్ధారించారు. లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో ఈసీ నిబంధనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా కలెక్టర్, ఐటీ అధికారులతో పాటు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. వారందరి సమక్షంలో కంటైనర్లు తనిఖీ చేసి నిబంధనల ప్రకారమే నగదు తరలిస్తున్నారన్నది నిర్ధరించుకున్నారు. ఆ తరువాత ఐటీ అధికారులు తనిఖీ చేసి అనుమతించిన తరువాత కంటైనర్లను హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతించారు.