విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్.. ఒకే టీమ్ లో ఆడబోతున్నారా?
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), జస్ప్రీత్ బుమ్రా (jasprit bumrah).. పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ అజామ్ (Babar Azam), షహీన్ అఫ్రిది (shaheen afridi) తదితర ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో నిర్వహించిన ఆఫ్రో-ఆసియా కప్ (afro-asia cup cricket) ను పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ భావిస్తుండమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2005, 2007లో ఆఫ్రో-ఆసియా కప్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఐతే పలు కారణాల వల్ల ఈ టోర్నమెంట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆఫ్రో-ఆసియా కప్ టోర్నమెంట్ లో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి క్రికెట్ ఆడేవారు.
2005, 2007 లో జరిగిన టోర్నమెంట్ లో ఆసియా జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఇంజామామ్ ఉల్ హక్, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్, అనిల్ కుంబ్లే, షహిద్ అఫ్రిది ఆడారు. షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఇప్పుడు ఆఫ్రో-ఆసియా కప్ టోర్నమెంట్ మళ్లీ ప్రారంభించాలని 2022లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జై షాతో అప్పటి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ACC) అధ్యక్షుడు సుమోద్ దామోదర్, ఏసీసీ డెవలప్మెంట్ హెడ్ మహింద వల్లిపురం సంప్రదింపులు జరిపారు. తాజాగా మహింద ఐసీసీ బోర్డు సభ్యునిగా తిరిగి ఎన్నికవడం, జై షా ఐసీసీ ఛైర్మన్ కావడంతో ఆఫ్రో-ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణ విషయంలో కదలిక వచ్చే ఛాన్స్ ఉందని ఏసీసీ మాజీ అధ్యక్షుడు దామోదర్ చెప్పారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.