కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి లోకేశ్
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
ఆంధ్రప్రదేశ్ లోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపి నివేధిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలను ఇడుపులపాయ ఐఐటీలో చేర్పించి నష్టపోతున్నామంటూ ఆవేధన వ్యక్తం చేశారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని విధ్యార్ధుల తల్లిదండ్రులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని ఈ సందర్బంగా మంత్రి లోకేశ్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. స్థానికంగా గంజాయిని ప్రోత్సహించే రాజకీయ నాయకులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు లోకేశ్ హామీ ఇచ్చారు.